TSRTC: బస్సు దొంగలకు అడ్డుకట్ట.. స్టీరింగ్‌లకు తాళాలు వేయనున్న ఆర్టీసీ!

  • దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన తెలంగాణ ఆర్టీసీ
  • స్టీరింగ్‌కు, రాడ్డుకు కలిపి గొలుసుతో తాళం
  • బస్సును స్టార్ట్ చేసినా ఎక్కువ దూరం తీసుకెళ్లలేరంటున్న అధికారులు

తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సు ఇటీవల చోరీకి గురికావడం సంచలనం సృష్టించింది. ఆ బస్సును మహారాష్ట్రలోని నాందేడ్ కు తీసుకెళ్లిన దుండగులు దానిని తుక్కుగా మార్చేశారు. ఈ ఘటనతో తీవ్ర విమర్శలపాలైన ఆర్టీసి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇకపై బస్సులు చోరీ కాకుండా స్టీరింగులకు తాళాలు వేయాలని నిర్ణయించింది. స్టీరింగ్ కదలకుండా రాడ్డుకు గొలుసుతో కట్టేసి తాళం వేయాలని ఓ నిర్ణయానికి వచ్చారు. ఇలా చేయడం వల్ల మారు తాళాలు, ఇగ్నిషన్ వైర్లను కలిపి బస్సును స్టార్ట్ చేసినప్పటికీ ఎక్కువ దూరం తీసుకెళ్లలేరని అధికారులు చెబుతున్నారు. వచ్చే వారం నుంచే ఈ గొలుసు తాళం విధానాన్ని అమలు చేయాలని, ఇందుకోసం రాడ్డుకు ఓ కొక్కెం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.

More Telugu News