tej bahaduru: మోదీపై పోటీ చేస్తున్న మాజీ జవాన్ తేజ్ బహదూర్ నామినేషన్ తిరస్కరణ

  • 2017లో విధుల నుంచి తేజ్ బహదూర్ తొలగింపు
  • దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వలేదన్న ఈసీ
  • సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న తేజ్ బహదూర్

ఉత్తరప్రదేశ్ వారణాసి లోక్ సభ స్థానంలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్ ను ఈసీ తిరస్కరించింది. ప్రధాని మోదీపై తేజ్ బహదూర్ పోటీకి నిలబడ్డారు. అయితే నామినేషన్ పత్రాలలో సరైన సమాచారాన్ని పొందుపరచని నేపథ్యంలో, అతని నామినేషన్ ను తిరస్కరించారు. విధుల నుంచి డిస్మిస్ చేసినట్టు ఆధారాలను ఇవ్వలేకపోయారనే కారణాన్ని చూపించారు.

జవాన్లకు నాసిరకం ఆహారాన్ని పెడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలను చేసిన ఆయనను 2017లో విధుల నుంచి తొలగించారు. ఈ అంశానికి సంబంధించి అఫిడవిట్ లో సరైన సమాచారం ఇవ్వలేదనే కారణంతో నామినేషన్ ను ఈసీ తిరస్కరించింది. సరైన డాక్యుమెంట్లను అందించడంలో విఫలమయ్యారని తెలిపింది.

ఈ సందర్భంగా తేజ్ బహదూర్ మాట్లాడుతూ, ఆధారాలను ఇవ్వాలని నిన్న సాయంత్రం 6.15 గంటలకు తనను అడిగారని... అన్ని డాక్యుమెంట్లను సమర్పించినప్పటికీ నామినేషన్ ను తిరస్కరించారని మండిపడ్డారు. ఈ విషయమై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

More Telugu News