Andhra Pradesh: ఐ-10 కారులో చెలరేగిన మంటలు.. త్రుటిలో తప్పించుకున్న తెలుగు కుటుంబం!

  • ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో ఘటన
  • హైదరాబాద్ నుంచి పాలకొల్లుకు ప్రయాణం
  • మార్గమధ్యంలో చెలరేగిన మంటలు

ఓ వాహనదారుడి అప్రమత్తత కారణంగా ఆయన కుటుంబం మొత్తం ప్రాణాలతో బయటపడింది. కారులో సజీవదహనం కాకుండా తప్పించుకోగలిగింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో ఈరోజు చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని ఓ ఫార్మా కంపెనీలో మల్లాది నరసింహ శాస్త్రి మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పాలకొల్లుకు ఐ-10 కారులో బయలుదేరారు.

వీరి వాహనం ఈరోజు ఉదయం విజయవాడ రూరల్ మండలం నిడమానూరు వద్దకు రాగానే ఒక్కసారిగా కారు వెనుక మంటలు అంటుకున్నాయి. అయితే అప్రమత్తంగా ఉన్న నరసింహ శాస్త్రి వెంటనే వాహనాన్ని ఆపేశారు. అనంతరం కుటుంబ సభ్యులను దిగిపోవాల్సిందిగా ఆదేశించారు. వీరంతా వాహనం నుంచి బయట పడగానే కారు పూర్తిగా మంటల్లో చిక్కుకుని కాలి బూడిద అయింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News