Jammu And Kashmir: జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదం పెరగడానికి మోదీనే కారణం: ఒమర్ అబ్దుల్లా

  • 2014తో పోలిస్తే రాష్ట్రంలో పోలింగ్ శాతం దారుణంగా పడిపోయింది
  • ఎమ్మెల్యేలను కొని, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం బీజేపీకి అలవాటే
  • సజ్జాద్ ఘనీ లోనీని సీఎం చేసేందుకు కూడా యత్నించారు

మోదీ ప్రధానిగా ఉన్న గత ఐదేళ్ల కాలంలోనే జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదం ఆందోళనకర స్థాయిలో పెరిగిందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. సోఫియాన్ లో ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ మోదీపై విమర్శలు గుప్పించారు. 2014కు ముందు ఉగ్రవాదంవైపు మళ్లిన యువకుల సంఖ్య కంటే ఇప్పుడు ఆ సంఖ్య ఎన్నో రెట్లు పెరిగిందని చెప్పారు. 2014తో పోలిస్తే రాష్ట్రంలో పోలింగ్ శాతం కూడా దారుణంగా పడిపోయిందని అన్నారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించడం లేదని ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. 1996 తర్వాత రాష్ట్రంలో సకాలంలో అసెంబ్లీకి ఎన్నికలు జరగకపోవడం ఇదే తొలిసారని విమర్శించారు. 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారన్న మోదీ వ్యాఖ్యలపై స్పందిస్తూ... ఎమ్మెల్యేలను కొనడం ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. గోవాలో ఇదే చేశారని, కర్ణాటకలో కూడా ఇదే చేయాలనుకున్నారని, అయితే కోర్టు అడ్డుకోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వారు ఇదే ధోరణితో రాజకీయం చేశారని మండిపడ్డారు.

జమ్ముకశ్మీర్ లోని పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జాద్ ఘనీ లోనీని ముఖ్యమంత్రిని చేసేందుకు కూడా బీజేపీ యత్నించిందని ఆరోపించారు. 

More Telugu News