Andhra Pradesh: దిశమార్చుకున్న ఫణి తుపాను.. ఊపిరి పీల్చుకున్న ఉత్తరాంధ్ర

  • రేపు పెను తుపానుగా మారనున్న ఫణి
  • 4న ఒడిశాలో తీరం దాటనున్న తుపాను
  • 3, 4 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఫణి తుపాను దిశ మార్చుకుంది. విషయం తెలిసిన ఉత్తరాంధ్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారిన ‘ఫణి’ ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమలికి 640 కిలోమీటర్లు, చెన్నైకి 730 కిలోమీటర్లు, మచిలీపట్టణానికి 840 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

మరో 12 గంటల్లో తీవ్ర తుపానుగా రూపాంతరం చెందనున్న ఫణి.. రేపటికి పెను తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రేపు సాయంత్రానికి ఈశాన్య దిశగా పయనించి ఆ తర్వాత దిశ మార్చుకుంటుందని పేర్కొంది. ఇది ఒడిశా దిశగా కదిలి అక్కడ తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఫలితంగా ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు తప్పినట్టేనని ఐఎండీ అధికారులు పేర్కొనడంతో ఉత్తరాంధ్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

కాగా, 4న ఒడిశాలో తీరం దాటనున్న తుపాను పశ్చిమ బెంగాల్ దిశగా పయనిస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో 3, 4 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.

More Telugu News