Telangana: ఆత్మహత్యాయత్నం చేసిన ఇంటర్ విద్యార్థిని మృతి

  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన
  • మూడు సబ్జెక్టుల్లో ఫెయిలైన లావణ్య
  • చికిత్స పొందుతూ మృతి

ఇంటర్‌లో ఫెయిలయ్యానన్న మనస్తాపంతో నాలుగు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన లావణ్య (18) ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మూడు సబ్జెక్టుల్లో ఫెయిలైంది.

దీంతో తీవ్ర మనస్తాపం చెందిన లావణ్య నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న లావణ్య పరిస్థితి విషమించడంతో సోమవారం సాయంత్రం ప్రాణాలు విడిచింది. చేతికి అందివచ్చిన కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News