Sachin Tendulkar: తొలిసారి కొడుకు, కూతురితో కలిసి ఓటేసి మురిసిపోయిన సచిన్ టెండూల్కర్

  • మహారాష్ట్రలో నేడు పోలింగ్
  • ముంబయిలో ఓటేసిన సచిన్ ఫ్యామిలీ
  • అందరూ ఓటేయాలంటూ పిలుపునిచ్చిన క్రికెట్ దేవుడు

భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశంలో నాలుగో విడత ఎన్నికల సందర్భంగా నేడు మహారాష్ట్రలోని పలు లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా, సచిన్ తొలిసారి తన కొడుకు, కుమార్తెతో కలిసి ఓటేశారు. ఈ మధుర క్షణాలను ఆయన ట్విట్టర్ లో పంచుకున్నారు. భార్య అంజలి, కొడుకు అర్జున్, కుమార్తె సారాలతో కలిసి ముంబయిలోని ఓ పోలింగ్ కేంద్రానికి విచ్చేసిన సచిన్ ఓటు వేసిన అనంతరం వేలికి ఉన్న సిరా మార్కు చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు.

ఓ ఫొటోను ట్వీట్ చేస్తూ, అర్జున్, సారాలతో కలిసి ఓటు వేయడం వల్ల ఈసారి ఎన్నికలు తనకు ఎంతో ప్రత్యేకం అని వ్యాఖ్యానించారు. అంతేగాకుండా, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ పిలుపునిచ్చారు. కాగా, సచిన్ వ్యాఖ్యలను బట్టి అర్జున్, సారాలకు కొత్తగా ఓటు హక్కు వచ్చినట్టు అర్థమవుతోంది.

More Telugu News