Murder: సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ మోసం.. నిలదీసిందని దారుణ హత్య!

  • పశ్చిమ గోదావరి జిల్లాలో ఘటన
  • మహితతో పరిచయం పెంచుకున్న మహేశ్
  • మనస్పర్థలు రావడంతో ఫ్రెండ్స్ తో కలిసి హత్య

సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి, ఓ యువతితో పరిచయం పెంచుకున్న యువకుడు, ఆపై ఉన్మాదిగా మారి ఆమె జీవితాన్ని బలిగొన్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజగొప్పు గ్రామంలో నిన్న సాయంత్రం వెలుగులోకి వచ్చిన పెనుమాల మహిత (18) దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది.

 పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, భీమవరం మండలం కే బేతపూడికి చెందిన మహిత తల్లిదండ్రులు గల్ఫ్ లో ఉంటున్నారు. ఆమె ఇంటర్ పూర్తి చేసి, తన మేనమాన గెడ్డం రవి ఇంట్లో ఉంటోంది. హైదరాబాద్ లో ఉంటున్న కురెళ్ల మహేశ్ అనే యువకుడు టాలీవుడ్ లో పనిచేసుకుంటున్నాడు. అతనికి మహిత పరిచయం కాగా, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో మహిత అతనికి మరింత దగ్గరైంది.

అయితే, ఎంతకీ సినిమా అవకాశం రాకపోవడంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. దీంతో ఆమెను హతమార్చాలని ప్లాన్ వేసిన మహేశ్, తన ఇద్దరు స్నేహితులతో కలిసి కాజగొప్పుకు వచ్చాడు. నిన్న సాయంత్రం ఆమెపై దాడిచేసి కత్తితో మెడపై నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన స్థానికులు చూస్తుండగానే జరిగింది. నిందితులు ముగ్గురిలో ప్రధాన నిందితుడైన మహేశ్ స్థానికులకు పట్టుబడగా, మిగతా ఇద్దరూ పరారయ్యారు. మహేశ్ కు దేహశుద్ధి చేసి, ఆపై పోలీసులకు అప్పగించారు. స్థానికుల దాడిలో తీవ్ర గాయాలపాలైన నిందితుడిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు, కేసును రిజిస్టర్ చేశారు.

More Telugu News