Andhra Pradesh: హే.. చంద్రబాబూ.. ప్రజాస్వామ్యం ఎక్కడ? సత్యానికి ఎందుకు వెన్నుపోటు పొడుస్తున్నారు!: రామ్ గోపాల్ వర్మ

  • నన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
  • బలవంతంగా హైదరాబాద్ కు పంపేస్తున్నారు
  • ట్విట్టర్ లో స్పందించిన రామ్ గోపాల్ వర్మ

విజయవాడలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు నిర్వహించాలనుకున్న ప్రెస్ మీట్ రద్దు అయిందని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారనీ, గన్నవరం విమానాశ్రయానికి తరలించారని వాపోయారు. ఇప్పుడు పోలీసులు తనను బలవంతంగా హైదరాబాద్ కు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘హే చంద్రబాబూ.. ఏపీలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? ఎందుకు నిజానికి వెన్నుపోటు పొడుస్తున్నారు?’ అని ప్రశ్నించారు. ఈ మేరకు వర్మ ట్వీట్ చేశారు. విజయవాడలో రోడ్డుపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాపై మీడియాతో మాట్లాడుతానని వర్మ చెప్పడంతో పోలీసులు ఆయన్ను గన్నవరం ఎయిర్ పోర్టుకు తరలించారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా వచ్చే నెల 1న ఏపీలో విడుదల కానుంది.

More Telugu News