Talasila Raghuram: ద్వివేదితో గంట పాటు సమావేశమైన వైసీపీ నేత మిథున్ రెడ్డి!

  • తలశిల రఘురామ్ తో కలిసి సచివాలయానికి
  • మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన మిథున్ రెడ్డి
  • భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రాజంపేట ఎంపీ మిథున్‌ రెడ్డి దాదాపు గంటపాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. సీఈవోతో ఆయన ఏం చర్చించారన్న విషయాలేవీ బయటకు రాలేదు. పార్టీ నేత తలశిల రఘురామ్‌ తో కలిసి సచివాలయంలోని ద్వివేది కార్యాలయానికి వచ్చిన మిథున్ రెడ్డి, రఘురామ్ ను లోనికి తీసుకెళ్లలేదని తెలుస్తోంది.

ఆపై గంట తరువాత బయటకు వచ్చిన ఆయన, మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం. కాగా, ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పలు పార్టీల నాయకులు సీఈఓ ద్వివేదితో చర్చలు జరిపారన్న సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు తొలి దశలో భాగంగా ముగియగా, ఓట్ల లెక్కింపునకు ఇంకా నాలుగు వారాల సమయం ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ ఏ విషయమై జరిగి ఉంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

More Telugu News