Tamilnadu: మైనర్ బాలిక రేప్.. ఆ తర్వాత కరెంట్ షాక్ ఇచ్చి కిరాతక హత్య!

  • తమిళనాడులోని దిండుగల్లు జిల్లాలో ఘటన
  • దారుణానికి పాల్పడ్డ ప్లస్ టూ విద్యార్థి
  • రేప్ తర్వాత పోలీసులకు చెబుతుందన్న భయంతో హత్య

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ విద్యార్థి, ఆమె ఆ విషయాన్ని బయటకు చెబుతుందన్న ఉద్దేశంతో కిరాతకానికి ఒడిగట్టాడు. సదరు బాలికకు కరెంట్ షాక్ ఇచ్చి చంపాడు. ఆమె పొరపాటున కరెంట్ షాక్ తగిలి చనిపోయినట్లు నాటకం రక్తి కట్టించాడు. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిందితుడు దొరికిపోయాడు. ఈ ఘటన తమిళనాడులోని దిండుగల్లు జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని జీ కురుంపట్టికి చెందిన ఏడో క్లాస్ విద్యార్థిని కొన్ని రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో ఇంట్లో చనిపోయింది. ఒళ్లంతా గాయాలతో నోటిలో విద్యుత్ వైర్లతో ఆమెను గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు.

పోస్ట్ మార్టంలో యువతిపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు ఇదే ప్రాంతానికి చెందిన ఓ ప్లస్ టూ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల విచారణలో తానే ఈ దారుణానికి తెగబడినట్లు బాలుడు అంగీకరించాడు.

ఈ నెల 16న బాలిక ఇంట్లో ఉండగా, తాను లైంగిక దాడికి పాల్పడ్డానని బాలుడు అంగీకరించాడు. ఆమె ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టి లొంగదీసుకున్నానని చెప్పాడు. చివరగా తనను పోలీసులకు పట్టిస్తుందన్న భయంతో ఆమె నోట్లో కరెంట్ వైర్లు పెట్టి షాక్ ఇచ్చి చంపేసినట్లు పేర్కొన్నారు.

More Telugu News