Mani Shankar Aiyar: నేను బతికే ఉన్నాను.. బాలాకోట్ దాడుల్లో చనిపోలేదు: కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్

  • బాలాకోట్ దాడుల్లో అయ్యర్ చనిపోయినట్టు రూమర్లు
  • తాను భేషుగ్గా ఉన్నానన్న అయ్యర్
  • తాను చనిపోయానని ఆశించిన వారికి చేదు వార్తేనన్న మణి

తాను చనిపోయినట్టు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ స్పందించారు. తాను భేషుగ్గా ఉన్నానని, ఇంకా బతికే ఉన్నానని, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో ఊపిరి సలపకుండా ఉన్నానని స్పష్టం చేశారు.

ఫిబ్రవరి 26న భారత వాయుసేన పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో జరిపిన దాడుల్లో తాను మృతి చెందినట్టు రూమర్లు వినిపిస్తున్నాయన్నారు. ‘‘నేను చనిపోయానని ఆశించిన వారికి ఇది విచారం కలిగించే వార్తే. నేను ఇంకా సజీవంగానే ఉన్నాను’’ అని అయ్యర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో తాను తీరికలేకుండా ఉన్నానని, ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, లక్నో నగరాలకు వెళ్తున్నట్టు చెప్పుకొచ్చారు.

కాగా, మణిశంకర్ అయ్యర్ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోని వ్యక్తిగా ఉంటారు. 2017లో గుజరాత్ ఎన్నికల్లో మోదీని ‘నీచ్ ఆద్మీ’గా పేర్కొని వివాదంలో చిక్కుకున్నారు. మణిశంకర్ వ్యాఖ్యలపై అప్పట్లో రాహుల్ గాంధీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News