KCR: రూ. 15 కోట్ల నుంచి రూ. 23 కోట్లకు పెరిగిన కేసీఆర్ ఆస్తి... లెక్కలు చెప్పాలని ఐటీ నోటీసులు!

  • 2014 - 18 మధ్య భారీగా పెరిగిన ఆస్తులు
  • ఐటీ రిటర్నులు ఇవ్వాలని ఆదేశాలు
  • తేడాలు చూపించిన పలువురు ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. 2014లో, 2018లో ఎన్నికల సమయంలో ఈసీకి సమర్పించిన అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తులు, అప్పుల విషయంలో తేడాలు ఉండటంతో, ఈ ఐదేళ్ల ఐటీ రిటర్నులూ ఇవ్వాలని ఆదేశించింది. ఒక్క కేసీఆర్ కే కాదు, లెక్కల్లో తేడాలు చూపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ నోటీసులు జారీ కాగా, వీరంతా ఆడిటర్ల వద్దకు పరుగులు పెట్టారు. లెక్కల్లో తేడాలుంటే, అందుకుగల కారణాలను ఆధారాలతో సహా వివరించాలని ఈ నోటీసుల్లో ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా, గణాంకాల మధ్య పెద్దగా తేడా లేనివారు హ్యాపీగానే ఉన్నా, రెండు అఫిడవిట్లలో భారీ తేడాను చూపించిన ఎమ్మెల్యేలు మాత్రం ఆందోళనలో ఉన్నారని సమాచారం. ఈ ఎన్నికల్లో గెలిచిన మిగతా పార్టీల అభ్యర్థులకు నోటీసులు రాకపోవడం గమనార్హం. ఇక ఈ ఐదేళ్ల కాలంలో భారీగా ఆస్తులు పెరిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వివరాలను చూస్తే, 2014లో రూ. 48.51 లక్షల ఆస్తులు చూపిన గువ్వల బాలరాజు (అచ్చంపేట) గతేడాది రూ. 6.96 కోట్ల ఆస్తిని చూపారు. జోగు రామన్న (ఆదిలాబాద్) ఆస్తులు రూ. 84.56 లక్షల నుంచి రూ. 3.78 కోట్లకు పెరిగినట్టు చూపారు. గొంగిడి సునీత (ఆలేరు) ఆస్తులు రూ. 1.90 కోట్ల నుంచి రూ. 4.85 కోట్లకు పెరిగాయి. పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ) ఆస్తులు రూ. 48.17 లక్షల నుంచి రూ. 4.94 కోట్లకు చేరాయి.

కేసీఆర్ ఆస్తి 2014లో రూ. 15.16 కోట్లుండగా, 2018 ఎన్నికల అఫిడవిట్ నాటికి అది రూ. 23.55 కోట్లకు చేరింది. హరీశ్ రావు ఆస్తి రూ. 2.96 కోట్ల నుంచి రూ. 11.44 కోట్లకు, కేటీఆర్ ఆస్తి రూ. 7.98 కోట్ల నుంచి రూ. 41.83 కోట్లకు పెరిగింది. వీరితో పాటు కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, శ్రీనివాసగౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ధర్మారెడ్డి, మహిపాల్ రెడ్డి,  దాస్యం వినయ్ భాస్కర్, గ్యాదరి కిశోర్ తదితరుల ఆస్తులూ భారీగా పెరిగాయి.

More Telugu News