Mamata Banarjee: ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు!: మమతా బెనర్జీ

  • గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా ఓట్లు చీలుతాయి
  • దేశానికి అతిపెద్ద ముప్పు బీజేపీనే
  • మోదీ రెండోసారి అధికారంలోకి వస్తే నాశనం చేస్తారు 

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో కాషాయదళానికి కనీసం 80 స్థానాలు కూడా రావని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కదని స్పష్టం చేశారు. గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కూడా ఓట్లు చీలిపోతాయని అన్నారు.

అంతేకాకుండా 440 వోల్టుల విద్యుత్ ఎంత ప్రమాదకరమో, బీజేపీ కూడా అంతే ప్రమాదకరం అని వ్యాఖ్యానించారు. బీజేపీ దేశానికి అతిపెద్ద ముప్పు అని అభివర్ణించారు. అందుకే ప్రజలు ఆ పార్టీకి దూరంగా ఉండాలని, పొరబాటున కూడా ఆ పార్టీకి మద్దతుగా ఓటేయవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం దేశానికి ఎలాంటి నష్టం ఉండదని, ఆ మేరకు తాను హామీ ఇస్తానని అన్నారు.

హుగ్లీ జిల్లాలోని పండువాలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో మమత మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. "బీజేపీ, మోదీ రెండోసారి అధికారంలోకి వస్తే దేశాన్ని భ్రష్టు పట్టిస్తారు. ఆ పార్టీ నిండా నిరక్షరాస్యులే. వాళ్ల నుంచి మనం ఏం ఆశిస్తాం చెప్పండి!" అంటూ విమర్శించారు.

More Telugu News