east delhi: బీజేపీ నేత గౌతం గంభీర్ పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు!

  • అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహణ
  • ఈసీకి నివేదిక పంపిన రిటర్నింగ్ అధికారి
  • గంభీర్ కు రెండు ఐడీలు ఉన్నాయని కోర్టులో ఆప్ పిటిషన్

మాజీ క్రికెటర్, బీజేపీ నేత గౌతమ్ గంభీర్ ఇబ్బందుల్లో పడ్డారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనపై రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూర్పు ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గంలో గంభీర్ ఇటీవల ముందస్తు అనుమతి తీసుకోకుండా ర్యాలీ నిర్వహించారు. ఈ విషయమై రిటర్నింగ్ అధికారి కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి నివేదిక పంపారు.

ఈ సందర్భంగా ఈసీ ఆదేశాలతో రిటర్నింగ్ అధికారి గంభీర్ పై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది. ప్రస్తుతం గంభీర్ తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. అంతకుముందు గంభీర్ కు రెండు ఓటర్ ఐడీలు ఉన్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని ఓ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆయనకు రాజేంద్రనగర్, కరోల్ బాగ్ లో ఓటు హక్కు ఉందని ఆరోపించింది.

More Telugu News