Telangana: ప్రేమ పేరుతో యువతిని గర్భవతిని చేసిన ప్రియుడు.. డబ్బులు తీసుకుని సెటిల్మెంట్ చేసుకోమంటున్న పోలీసులు!

  • తెలంగాణలోని హైదరాబాద్ లో ఘటన
  • భార్యగా స్వీకరించేందుకు నో
  • గర్భం పోగొట్టేందుకు బలవంతంగా మాత్రలు
  • మీడియాను ఆశ్రయించిన బాధితురాలు

ప్రేమించానన్నాడు. జీవితాంతం తోడుంటానని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే అందరిముందు భార్యగా స్వీకరించాలని కోరగా, నిరాకరించాడు. అంతేకాకుండా దాడికి పాల్పడ్డాడు. ఈ విషయంలో న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే డబ్బులు తీసుకుని సెటిల్ చేసుకోవాలని ఉచిత సలహాలు ఇచ్చారు. దీంతో బాధితురాలు మీడియాను ఆశ్రయించింది. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

హైదరాబాద్ లోని రహ్మత్ నగర్ కు చెందిన వెంకటేశ్ అనే యువకుడు మంజు అనే యువతి వెంటపడ్డాడు. ప్రేమిస్తున్నానని రెండేళ్ల పాటు తిరిగాడు. దీంతో అతని మాటలు నమ్మిన యువతి ప్రేమించడం మొదలుపెట్టింది. ఇద్దరు కలిసి రహస్యంగా ఓ గుడిలో వివాహం కూడా చేసుకున్నారు. అనంతరం నగరంలోనే వీరిద్దరూ కలిసి కాపురం పెట్టారు. అయితే గర్భం దాల్చడంతో తనను అందరిముందు భార్యగా స్వీకరించాలని మంజు కోరింది. అయితే ఇందుకు వెంకటేశ్ ఒప్పుకోలేదు.

ఈ సందర్భంగా దంపతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో భార్య మంజు గర్భాన్ని పోగొట్టేందుకు బలవంతంగా మాత్రలు మింగించాడు. ఈ వేధింపులు హద్దులు దాటడంతో తనకు న్యాయం చేయాలంటూ మంజు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే బాధితురాలికి న్యాయం చేయాల్సిందిపోయి.. ‘వెంకటేశ్ నీకు రూ.3 లక్షలు ఇస్తాడు. సెటిల్మెంట్ చేసుకో. నీ కంప్లయింట్ వాపస్ తీసుకో’ అని ఉచిత సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో చివరికి బాధితురాలు మీడియాను ఆశ్రయించింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరింది.

More Telugu News