anil kumble: శ్రీలంక బాంబు పేలుళ్ల నుంచి అనిల్ కుంబ్లే తప్పించుకున్న వైనం!

  • పేలుడు జరిగిన షాంగ్రి లా హోటల్ లో బస చేసిన కుంబ్లే కుటుంబం
  • అల్పాహారం ముగించుకుని యాలా నేషనల్ పార్కుకు పయనం
  • అక్కడ ఉండగానే పేలుడు సంభవించినట్టు సమాచారం

ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో ఉగ్రవాదులు జరిపిన వరుస పేలుళ్లలో 253 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాదాపు 500 మంది ఈ ఘటనలో గాయపడ్డారు. మరోవైపు, ఈ దాడుల నుంచి భారత్ క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే సురక్షితంగా బయటపడ్డ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలసి వేసవి సెలవులను ఎంజాయ్ చేసేందుకు కుంబ్లే శ్రీలంక వెళ్లాడు.

బాంబు పేలుళ్లు చోటు చేసుకున్న కొలంబోలోని షాంగ్రి లా హోటల్ లోనే వీరు బసచేశారు. పేలుళ్లు జరిగిన నాటి ఉదయం వారు అల్పాహారం తీసుకున్నారు. అయితే, పేలుడు జరగడానికి గంటల ముందు వారు హోటల్ నుంచి బయటకు వచ్చారు. యాలా నేషనల్ పార్క్ లో వారు ఉండగా... హోటల్ లో బాంబు పేలుడు జరిగినట్టు కుంబ్లేకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో శ్రీలంక పర్యటనను వారు అర్ధాంతరంగా ముగించుకుని, మంగళవారం నాడు బెంగళూరు చేరుకున్నారు.

అనిల్ కుంబ్లే కుటుంబం అల్పాహారం తీసుకున్న ప్రాంతంలోనే సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు.

More Telugu News