Congress: దేశ రాజధానిలో కనిపించని మహిళా సాధికారత.. పోటీలో ఉన్న 173 మందిలో మహిళలు 13 మందే!

  • ఢిల్లీలో పెరగని మహిళా అభ్యర్థులు
  • గత 15 ఏళ్లుగా అభ్యర్థుల సంఖ్యలో కనిపించని మార్పు
  • మహిళలను గెలిపించని ఓటర్లు

మహిళా సాధికారత, సమానత్వం గురించి మాట్లాడే రాజకీయ పార్టీలు నిజ జీవితంలో వారికిస్తున్న ప్రాధాన్యం ఏపాటిదో ఢిల్లీ ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులను చూస్తే తెలిసిపోతుంది. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 173 మంది అభ్యర్థులు బరిలో నిలవగా వారిలో కేవలం 13 మంది మాత్రమే మహిళలు కావడం గమనార్హం. అంటే రాజకీయ పార్టీలన్నీ ఏకమొత్తంగా మహిళలను దూరం పెట్టాయన్న మాట. కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒక్కో మహిళా అభ్యర్థికి మాత్రమే టికెట్లు ఇచ్చాయి. మిగతా పది మందీ చిన్నా చితకా పార్టీలకు చెందిన వారు, స్వతంత్రులు ఉన్నారు.

గత ఎన్నికల్లో 150 మంది పోటీ చేయగా అప్పుడు కూడా 13 మంది మహిళలు మాత్రమే పోటీ చేశారు. వారిలో బీజేపీకి చెందిన మీనాక్షి లేఖి మాత్రమే ఎన్నికయ్యారు.2009లో 160 మంది పోటీకి దిగితే అందులో 18 మంది మహిళలు ఉన్నారు. అప్పుడు కూడా ఎన్నికైంది ఒక్క మహిళే. కాగా, ఈ ఎన్నికల్లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపగా, సిట్టింగ్ ఎంపీ మీనాక్షి లేఖికి బీజేపీ మరోసారి టికెట్ ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ అతిషి మార్లేనాను పోటీకి దింపింది.

మొత్తం 349 మంది ఈనెల 16న నామినేషన్లు సమర్పించగా 173 మంది నామినేషన్లు అర్హత సాధించాయి. ఢిల్లీలో 1.43 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 64 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

More Telugu News