Tata Ace: డ్రైవర్ నిర్లక్ష్యం.. ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం!

  • టూ వీలర్‌ను గమనించకుండా డోర్ తీశాడు
  • బండిపై నుంచి పడిపోయిన దంపతులు 
  • భర్త అక్కడికక్కడే మృతి

ఓ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకోగా.. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. హైదరాబాద్ నగర శివారులోని బొల్లారంలో రోడ్డుపై టాటా ఏస్ వాహనాన్ని ఆపిన డ్రైవర్, వెనుక వస్తున్న ద్విచక్ర వాహనాన్ని గమనించకుండా డోర్‌ను తెరిచాడు. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఎమ్మెస్ రెడ్డి, నీలవేణి దంపతులు కింద పడిపోయారు.

అదే సమయంలో అటుగా వస్తున్న లారీ వారి పై నుంచి పోవడంతో ఎమ్మెస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, నీలవేణి తీవ్ర గాయాలపాలైంది. ఆమెను హుటాహుటిన పటాన్‌చెరులోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు కారణమైన టాటా ఏస్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఎమ్మెస్ రెడ్డి దంపతులు బొల్లారంలోని జ్యోతి నగర్ కాలనీలో నివాసముంటున్నారు. నీలవేణి అరబిందో ఫార్మసీలో పని చేస్తున్నారు. ఆమెను ఫార్మసీ వద్ద దింపడానికి ఎమ్మెస్ రెడ్డి వెళుతుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

More Telugu News