Mounika: ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేదని... నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య!

  • పుణెలో పని చేస్తున్న మౌనిక
  • మెరుగైన వేతనం కోసం ఇంటర్వ్యూకు
  • ఆపై ఆత్మహత్య

ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో వేతనం తక్కువగా ఉందన్న ఆలోచనలో ఉన్న ఓ యువతి, మెరుగైన జాబ్ కోసం ఇంటర్వ్యూకు వెళ్లి, అక్కడ విజయవంతం కాలేకపోయానన్న ఒత్తిడిలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కోరుట్లకు చెందిన పిట్ల శేషు, జ్యోతి దంపతుల కుమార్తె మౌనిక (23). శేషు ఉద్యోగం నిమిత్తం దుబాయ్ లో ఉంటాడు.

 హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన మౌనిక, పుణెలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో రెండేళ్లుగా పని చేస్తోంది. ఆ కంపెనీలో వేతనం తక్కువగా ఉండటంతో మరో కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లింది. ఆపై తల్లికి ఫోన్ చేసి, ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేదని చెప్పి బాధపడింది. కాసేపటి తరువాత తల్లి ఫోన్ చేసి మాట్లాడేందుకు ప్రయత్నించగా, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆందోళనలో ఆమె ఉండగానే, మౌనిక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పుణె నుంచి సమాచారం వచ్చింది. దీంతో జ్యోతి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

More Telugu News