Soumya Sarkar: చితక్కొట్టిన బంగ్లాదేశ్ క్రికెటర్ సౌమ్య సర్కార్.. 16 సిక్సర్లతో 208 నాటౌట్

  • డీపీఎల్‌లో బంగ్లాదేశ్ క్రికెటర్ అరుదైన చరిత్ర
  • తొలి వికెట్‌కు 312 పరుగుల భాగస్వామ్యం
  • డీపీఎల్ ట్రోఫీని ఎగరేసుకుపోయిన అబహానీ జట్టు

ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో బంగ్లాదేశ్ ఆటగాడు సౌమ్య సర్కార్ చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించాడు. షేక్ జమాల్ ధన్‌మోండి క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌమ్య సర్కార్ బౌలర్లపై దయాదాక్షిణ్యాలు లేకుండా విరుచుకుపడ్డాడు. అబహానీ లిమిటెడ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 26 ఏళ్ల సర్కార్ 153 బంతుల్లో 16 సిక్సర్లు 14 ఫోర్లతో 208 పరుగులు (నాటౌట్) చేశాడు. 318 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన అబహానీ జట్టు సౌమ్య సర్కార్, జహురుల్ దెబ్బకు మరో 17 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది.

మరో ఓపెనర్ జహురుల్ ఇస్లాంతో కలిసి సౌమ్య సర్కారు తొలి వికెట్‌కు 312 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వంద బంతులు ఎదుర్కొన్న జహురుల్ 128 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీ బాదిన సౌమ్య సర్కార్ అరుదైన రికార్డును తన పేర లిఖించుకున్నాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. 2017లో అకీబుల్ హసన్ 190 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు అదే అత్యుత్తమం కాగా, ఇప్పుడా రికార్డును సౌమ్య సర్కార్ తిరగరాశాడు.

More Telugu News