Telangana: విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు: పవన్ కల్యాణ్

  • తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం
  • ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి
  • న్యాయ విచారణకు ఆదేశించాలి

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల భవిష్యత్ ను అగమ్యగోచరంగా మార్చడం దారుణమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఇంటర్ ఫలితాలు ప్రకటించాక 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని అన్నారు. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పరీక్ష ఫీజు చెల్లింపు, పేపర్ వాల్యుయేషన్ నుంచి ఫలితాల వెల్లడయ్యే వరకూ ప్రతి దశపైనా విద్యార్థుల్లోనూ, వారి తల్లిదండ్రుల్లో అనేక సందేహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసి, నిజాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. సందేహాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఎదురుదాడి చేసే విధంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నట్టు
పేర్కొన్నారు.
 
ఆత్మహత్యలకు పాల్పడొద్దు

జీవితం చాలా విలువైందని, ఈ ఫలితాలతో నిరాశ చెంది విద్యార్థులెవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని పవన్ కల్యాణ్ కోరారు. విద్యార్థులకు జనసేన అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేసి తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇన్ని తప్పిదాలకు కారణమైన ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు, సాఫ్ట్ వేర్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు న్యాయ విచారణకు ఆదేశించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

More Telugu News