Digvijay Singh: కాంగ్రెస్ సీనియర్ నేత డిగ్గీ రాజా సభలో మాట్లాడిన యువకుడికి బీజేపీ సన్మానం

  • మోదీ సర్జికల్ స్ట్రయిక్స్‌ను ప్రస్తావించిన అమిత్
  • ఉగ్రవాదులను మట్టు బెట్టారని వెల్లడి
  • వేదికపై నుంచి కిందకు దించేసిన కాంగ్రెస్ నేతలు

ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత, భోపాల్ లోక్‌సభ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ సభలో మాట్లాడిన యువకుడిని బీజేపీ సన్మానించింది. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా డిగ్గీ రాజా, ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో డిగ్గీ రాజా పిలవడంతో జనంలో ఉన్న అమిత్ మాలి అనే వ్యక్తి వేదికపైకి వచ్చి మోదీ సర్జికల్ దాడులు నిర్వహించి ఉగ్రవాదులను మట్టుబెట్టారని ప్రశంసిస్తూ చెప్పడంతో కాంగ్రెస్ నేతలు కంగు తిన్నారు. వెంటనే అమిత్‌ను వేదికపై నుంచి కిందకు దించేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వీడియోను చూసిన బీజేపీ, అమిత్‌పై ప్రశంసలు కురిపించడమే కాకుండా అతన్ని తమ పార్టీ కార్యాలయానికి రప్పించి మరీ సన్మానించింది. ఈ సందర్భంగా అమిత్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ సభలో భాగంగా దిగ్విజయ్, ఎవరికైనా తమ అకౌంట్లలో రూ.15 లక్షలు జమ అయ్యాయా? అని ప్రశ్నించినపుడు తాను చెయ్యి పైకెత్తానని, దీంతో తనను వేదిక పైకి పిలిచారన్నారు. ఆ సమయంలోనే తాను సర్జికల్ దాడుల గురించి మాట్లాడటంతో తనను స్టేజిపై నుంచి కిందకు పంపేశారన్నారు. అయినప్పటికీ అక్కడున్న వారు ఎవరూ కూడా తనతో అనుచితంగా ప్రవర్తించలేదని అమిత్ తెలిపారు.

More Telugu News