TTV dinakaran: పరప్పణ అగ్రహార జైల్లో శశికళతో దినకరన్‌ భేటీ

  • ఎన్నికల సమయంలో వీరి కలయికకు ప్రాధాన్యం
  • ఉదయమే జైలుకు చేరుకుని సాయంత్రం వరకు అక్కడే
  • అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగం పార్టీ నడుపుతున్న దినకరన్‌

జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండగా అన్నీతానై చక్రం తిప్పి, ఆమె మరణానంతరం జైలుపాలైన శశికళను ఆమె మేనల్లుడు, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) అధినేత టీటీవీ దినకరన్‌ నిన్న కలిశారు. జయలలిత అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం పరప్పణ అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళను దినకరన్‌ ఎన్నికల సమయంలో కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఉదయం ఆయన జైలు వద్దకు చేరుకుని సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయాలపై ఆమెతో చర్చించినట్లు సమాచారం. జయలలిత బతికున్నప్పుడు ఏఐఏడీఎంకే పార్టీ కోశాధికారిగా దినకరన్ వ్యవహరించేవారు. ఆమె మృతి తర్వాత ఏర్పడిన అంతర్గత విభేదాల కారణంగా దినకరన్‌ను 2017 ఆగస్టులో పార్టీ నుంచి బహిష్కరించారు.

జయలలిత ప్రాతినిధ్యం వహించిన రాధాకృష్ణన్ నగర్‌ (ఆర్‌.కె.నగర్‌) నియోజకవర్గంలో ఆమె మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి దినకరన్ సంచలన విజయాన్ని నమోదు చేసి జయలలితకు తానే అసలైన వారసుడినని ప్రకటించుకున్నారు. అదే ఉత్సాహంతో గత ఏడాది మార్చి 15వ తేదీన అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగం పార్టీని స్థాపించి నడుపుతున్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తన పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించి సత్తాచాటే యత్నం చేస్తున్నారు.

More Telugu News