PM Narendra modi: ‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్‌ను అందుకే ఆపేశాం: సుప్రీంకోర్టుకు చెప్పిన ఈసీ

  • సినిమాను చూసిన ఎన్నికల సంఘం కమిటీ
  • సుప్రీంకోర్టుకు నివేదిక 
  • సినిమా విడుదలైతే ఎన్నికల సమతౌల్యత దెబ్బతింటుందన్న నివేదిక

ప్రధాని నరేంద్రమోదీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘పీఎం నరేంద్రమోదీ’ సినిమా విడుదలను ఎందుకు అడ్డుకున్నదీ సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం తెలియజేసింది. సినిమాలోని పాత్ర, నాటకీకరణ అన్నీ ఓటర్లను ప్రభావితం చేసేవిగా ఉన్నాయని, అందుకనే చివరి విడత ఎన్నికలు జరిగే మే 19 వరకు సినిమా విడుదలను అడ్డుకున్నట్టు సుప్రీంకోర్టుకు ఈసీ విన్నవించింది. సినిమా విడుదలైతే ఎన్నికల సమతౌల్యత దెబ్బతింటుందని, ప్రత్యేకంగా ఓ పార్టీకి మేలు చేసేలా ఉందని వివరించింది.

ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక బృందం ‘పీఎం నరేంద్రమోదీ’ సినిమాను చూసిన అనంతరం సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది ద్వారా తమ నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్‌కు ఇటీవల సమర్పించింది.

నరేంద్రమోదీ పాత్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని ఆ నివేదికలో పేర్కొంది. సినిమాలోని చాలా సన్నివేశాలు ప్రతిపక్ష పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని, ఆ పార్టీని పూర్తి లంచగొండి పార్టీగా చూపించారని పేర్కొంది. సినిమాలో చూపించిన గుర్తులు, నినాదాలు, సీన్లు అన్నీ ఓటర్లను ప్రభావితం చేసేవిగా ఉన్నాయని, సినిమాలో ప్రత్యేకంగా ఓ వ్యక్తికి సాధువు హోదా ఇచ్చారని కమిటీ తన నివేదికలో పేర్కొంది.

More Telugu News