Saudi Arabia: సౌదీ అరేబియాలో ఒకేసారి 37 మందికి మరణశిక్ష అమలు

  • ఉగ్రవాదంపై ఉక్కుపాదం
  • పలు చోట్ల శిక్ష అమలు
  • ఇప్పటివరకు వివిధ నేరాలపై 100 మందికి మరణశిక్ష

కఠిన చట్టాలకు పెట్టింది పేరైన సౌదీ అరేబియా తాజాగా 37 మందికి మరణశిక్ష అమలు చేసింది. సౌదీ అధికారిక మీడియా సంస్థ సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఈ మేరకు వివరాలు తెలిపింది. దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై వాళ్లకు మరణశిక్ష విధించినట్టు పేర్కొంది. ఈ మరణశిక్షలు రియాద్, మక్కా, మదీనా, సెంట్రల్ ఖాసిం ప్రావిన్స్, ఈస్ట్రన్ ప్రావిన్స్ లలో అమలు చేశారు.

ఉగ్రవాద భావజాలాన్ని తలకెక్కించుకోవడం, అతివాద ధోరణి, దేశభద్రతను అస్థిరపరిచేందుకు టెర్రరిస్ట్ సెల్స్ ఏర్పాటు వంటి అభియోగాలపై ఆ 37 మందికి మరణశిక్ష విధించారు. వారిలో ఒకరిని మరణశిక్ష అనంతరం స్తంభానికి వేలాడదీసినట్టు సమాచారం. మరీ తీవ్రమైన నేరాలకు పాల్పడినవాళ్లకు ఇలాంటి శిక్ష విధిస్తారు. సాధారణంగా సౌదీలో మరణశిక్ష అంటే శిరచ్ఛేదంతో చంపేస్తారు. దేశంలో ఈ ఏడాది ఇప్పటివరకు 100 మందికి మరణశిక్ష విధించినట్టు సౌదీ మీడియా పేర్కొంది.

More Telugu News