Telangana: ప్రధాని మోదీకి తెలంగాణ రైతుల సెగ.. వారణాసిలో పోటీకి దిగుతున్న 50 మంది రైతన్నలు!

  • ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్ నుంచి ప్రయాణం
  • రేపు నామినేషన్లు దాఖలు చేయనున్న రైతులు
  • పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధర విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగానే

ప్రధాని నరేంద్ర మోదీకి షాక్ ఇచ్చేందుకు తెలంగాణ పసుపు రైతులు సిద్ధమయ్యారు. వారణాసి లోక్ సభ స్థానం నుంచి మోదీకి వ్యతిరేకంగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్ గ్రామీణ ప్రాంతాలకు చెందిన 50 మంది రైతులు వారణాసికి వెళ్లి రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు మద్దతు ధర విషయంలో కేంద్రం అలసత్వానికి నిరసనగానే తాము వారణాసిలో పోటీకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు.

వారణాసిలో పోటీ సందర్భంగా తాము ఎవరికీ వ్యతిరేకంగా ప్రచారం చేయబోమని రైతులు తెలిపారు. పసుపుబోర్డు, మద్దతుధర కోసం తాము చేసిన పోరాటాన్ని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి నేత కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు కోసం పోరాడారని వ్యాఖ్యానించారు. తమకు మద్దతుగా వారణాసికి తమిళనాడుకు చెందిన రైతులు కూడా వస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలంతా తమకు మద్దతు తెలియజేయాలని కోరారు.

More Telugu News