Sai Dharam Tej: తన తల్లిదండ్రుల విడాకులపై స్పందించిన సాయిధరమ్ తేజ్!

  • పదిహేనేళ్ల క్రితం అమ్మానాన్నా విడిపోయారు
  • 2011లో అమ్మ మళ్లీ పెళ్లి చేసుకుంది
  • ఆమెకు ఓ తోడు ఉండాలని భావించాం

మెగాస్టార్ చిరంజీవి పరిచిన బాటలో అనేకమంది హీరోలుగా రావడం తెలిసిందే. అలాంటివారిలో సాయిధరమ్ తేజ్ ఒకరు. మొదట్లో హిట్లు కొట్టినా, ఆపై వరుస పరాజయాలతో రేసులో వెనుకబడ్డారు. అయితే చిత్రలహరి సినిమాతో మరోసారి సక్సెస్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ లో ఇప్పటివరకు చాలా తక్కువమందికే తెలిసిన విషయాలను అందరితో పంచుకున్నారు. తన తల్లిదండ్రులు పదిహేనేళ్ల క్రితమే విడిపోయారని తెలిపారు.

"అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను. మేం మా అమ్మ వద్దే ఉండిపోయాం. మా నాన్నతో ఇప్పటికీ మాట్లాడుతుంటాను కానీ, అప్పుడున్నంత ఫీల్ ఇప్పుడుందని చెప్పలేను. ఆయనకు సినిమా రంగం గురించి పెద్దగా అవగాహనలేదు. మా అమ్మే నన్ను, తమ్ముడ్ని ఈ స్థాయికి తీసుకువచ్చారు. తల్లయినా, తండ్రయినా మాకు ఆమే. అయితే, మా కోసం తన జీవితాన్ని వృథా చేసుకోకుండా ఆమెకూ ఓ తోడు ఉంటే బాగుంటుందని ఆలోచించాం. ఆ విధంగా అమ్మ 2011లో మరో పెళ్లి చేసుకున్నారు. మా పెళ్లిళ్లు అయిపోతే ఆమె ఒంటరితనం ఫీల్ కాకూడదన్నదే మా ఆలోచన. అందరం కలిసే ఆ నిర్ణయం తీసుకున్నాం. మా సవతి తండ్రితో మా సంబంధాలు బాగానే ఉన్నాయి. ఆయన కేర్ హాస్పిటల్లో కంటి డాక్టర్. చాలా మంచి వ్యక్తి. మాకు ఎక్కడా ఇబ్బంది కలిగించేలా వ్యవహరించరు" అని వివరించారు.

More Telugu News