Telangana: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్.. విచారణకు స్వీకరించిన ధర్మాసనం!

  • దాఖలు చేసిన బాలల హక్కుల సంఘం
  • సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని విన్నపం
  • మధ్యాహ్నం తర్వాత విచారించనున్న హైకోర్టు

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల కష్టంపై బాలల హక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. ఇంటర్ విద్యార్థుల మార్కుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ తప్పిదం చోటుచేసుకుందనీ, కాబట్టి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే కొత్త ఏజెన్సీకి ఈ బాధ్యతలను అప్పగించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో ధర్మాసనానికి విన్నవించింది. ఈ మేరకు బాలల హక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

కాగా, ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు మధ్యాహ్నం తర్వాత విచారిస్తామని స్పష్టం చేసింది. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో చాలామంది విద్యార్థుల మార్కులు గోల్ మాల్ అయిన సంగతి తెలిసిందే. తొలి ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు రెండో ఏడాది ఫెయిల్ అయిన ఘటనలు చాలా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో మనస్తాపంతో పలువురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

More Telugu News