Telangana: తెలంగాణలో ఇంటర్ బోర్డు రగడ.. సీఎస్ జోషీతో సమావేశమైన విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్!

  • పలువురు ఇంటర్ విద్యార్థుల మార్కులు గోల్ మాల్
  • బోర్డు ఆఫీసుల ముందు పిల్లలు, తల్లిదండ్రుల ఆందోళన
  • పరిస్థితిని సీఎస్ కు వివరించిన విద్యాశాఖ కార్యదర్శి

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల మార్కుల గోల్ మాల్ వ్యవహారం పెనుదుమారం రేపుతోంది. తమ పిల్లలకు న్యాయం చేయాలని పలువురు తల్లిదండ్రులు ఆందోళనకు దిగగా, వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈరోజు కూడా వందలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హైదరాబాద్ లోని ఇంటర్ బోర్డు కార్యాలయం దగ్గరకు చేరుకోగా, పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీతో సమావేశమయ్యారు.

ఇంటర్ పరీక్షల మార్కుల విషయంలో చోటుచేసుకున్న తప్పిదాలను జనార్దన్ సీఎస్ జోషీకి వివరించారు. మార్కులు తారుమారు ఎందుకయ్యాయి? మొదటి సంవత్సరం టాపర్ గా నిలిచిన విద్యార్థులకు రెండో ఏడాది ఫెయిల్ మార్కులు రావడం ఏంటి? చాలామంది విద్యార్థులకు 10 మార్కులకు మించి రాకపోవడం వంటి విషయాలను సీఎస్ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ ను అడిగి తెలుసుకున్నారు. కాగా, ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. 

More Telugu News