Elections: 13 రాష్ట్రాల్లో ప్రారంభమైన మూడో దశ పోలింగ్.. బరిలో హేమాహేమీలు

  • 13 రాష్ట్రాలు, 116 నియోజకవర్గాల్లో పోలింగ్
  • పోటీలో 1,640 మంది అభ్యర్థులు
  • పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు 

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు దేశవ్యాప్తంగా మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ఓటర్లు తమ రాకకోసం ఎదురుచూస్తున్నారు. మొత్తం 13 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 116 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 1,640 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నిజానికి మూడో దశ ఎన్నికలు 115 స్థానాల్లోనే జరగాల్సి వుంది. అయితే, రెండో దశలోనే పోలింగ్ జరగాల్సిన త్రిపురలోని తూర్పు స్థానం ఎన్నికను మూడో దశకు మార్చడంతో ఓ స్థానం పెరిగింది.

హేమాహేమీలంతా ఈ విడతలోనే బరిలో ఉండడంతో మూడోదశకు ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్, జయప్రద, వరుణ్ గాంధీ, సుప్రియా సూలె, శశిథరూర్, మల్లికార్జున ఖర్గే తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లోక్‌సభ స్థానాలతోపాటు ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతోంది. కాగా, శ్రీలంక ఉగ్రదాడుల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

More Telugu News