Chandrababu: ఈ ఎన్నికల్లో బీజేపీకి అంతకుమించి సీట్లు రావు!: చంద్రబాబు జోస్యం

  • ఈ ప్రధాని మనకొద్దు.. దించేద్దాం
  • 126 మంది ఎంపీలు మద్దతు ఇచ్చినా కరుడుగట్టిన మోదీ మనసు కరగలేదు
  • పనిగట్టుకుని ప్రతిపక్ష నేతల ఇళ్లలో సోదాలు

ఈ ఎన్నికల్లో బీజేపీకి 150-170 సీట్లకు మించి రావని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జోస్యం చెప్పారు. ఆదివారం కర్ణాటకలోని శ్రీరామనగర, సింధనూరు ఎన్నికల బహిరంగ సభల్లో మాట్లాడిన చంద్రబాబు ప్రధాని మోదీపై మరోమారు విరుచుకుపడ్డారు. మహాత్ముడు జన్మించిన ప్రాంతంలో పుట్టిన మోదీ పచ్చి అబద్ధాలు చెబుతూ ఆ ప్రాంతానికే కళంకం తెస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి ప్రధాని ఉంటే దేశానికి ప్రమాదమని,  దించేద్దామని అన్నారు. ప్రవాసాంధ్రులు, కన్నడిగులు ఇందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.

తిరుపతి వేంకటేశ్వరుడి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న మోదీ.. దారుణంగా మోసం చేశారన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసమే ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చి తిరుగుబాటు చేసినట్టు చెప్పారు. 126 మంది ఎంపీలు మద్దతు ఇచ్చినా కరుడుగట్టిన మోదీ మనసు మారలేదన్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం లేకపోయినా, ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, ఆ సొమ్మంతా ఎక్కడి నుంచి తెచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై పనిగట్టుకుని మరీ సీబీఐతో దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

More Telugu News