Chandrababu: చంద్రబాబు అవన్నీ ఈసీ అనుమతి తీసుకునే చేస్తున్నారా?: ఈసీకి విజయసాయి లేఖ

  • ప్రజా వేదికను పార్టీ అవసరాల కోసం వినియోగిస్తున్నారు
  • టెలీ కాన్ఫరెన్స్ సదుపాయాలను వాడుతున్నారు
  • ఎన్నికల కోడ్ సక్రమంగా అమలయ్యేలా చూడండి

ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారంటూ వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి లేఖ రాశారు. పార్టీ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అయిన వీడియో, టెలీ కాన్ఫరెన్స్ సదుపాయాలను వాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ సముదాయమైన ప్రజా వేదికను పార్టీ అవసరాల కోసం చంద్రబాబు ఉపయోగిస్తున్నారని విజయసాయి ఆరోపించారు.

ప్రభుత్వ అతిథి భవనాలు, మీటింగ్ హాల్‌లు ఇతర సదుపాయాలను మిగిలిన పార్టీలు కూడా వినియోగించుకునేందుకు సమాన అవకాశం కల్పించాలని విజయసాయి కోరారు. అసలు ఈ సదుపాయాలన్నింటినీ వాడుకునేందుకు చంద్రబాబు ఈసీ అనుమతి తీసుకున్నారో, లేదో కూడా తమకు తెలియపరచాలని కోరారు. ఈ సంఘటనలపై సమీక్షించి ఎన్నికల కోడ్ సక్రమంగా అమలయ్యేలా స్పష్టమైన ఆదేశాలివ్వాలని విజయసాయి ఈసీని కోరారు.

More Telugu News