Narendra Modi: మోదీని చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతోంది: శరద్ పవార్

  • తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు పవార్ తనకు సహకరించారన్న మోదీ
  • పవార్ వేలు పట్టుకుని రాజకీయాల్లో ఎదిగానని చెప్పిన ప్రధాని
  • మోదీ మళ్లీ ప్రధాని అయితే ఏం చేస్తారోనని భయపడుతున్న పవార్

ప్రధాని నరేంద్రమోదీని చూస్తుంటే తన వెన్నులో వణుకు పుడుతోందని, భయంతో కంపించిపోతున్నానని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. తన వేలు పట్టుకుని రాజకీయాల్లో ఎదిగానని మోదీ చెప్పారని, కానీ ఇప్పుడు అదే మోదీని చూస్తుంటే తనకు భయం వేస్తోందని అన్నారు. మోదీ కనుక మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ఏమోనని, ఈ విషయం ఎవరికీ అర్థం కావడం లేదని శరద్ పవర్ పేర్కొన్నారు.

అప్పటి యూపీఏ ప్రభుత్వంలో శరద్ పవార్  సీనియర్ మంత్రిగా ఉన్న రోజుల్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న తనకు ప్రతి విషయంలో సహకరించేవారని 2016లో పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ గుర్తు చేసుకున్నారు. తనకు కితాబిచ్చిన మోదీని చూస్తుంటే ఇప్పుడు తనకు భయం వేస్తోందంటూ పవార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

శరద్ కుమార్తె సుప్రియా సూలే మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా శనివారం దాంద్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్న పవార్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మోదీ ఏడు సభల్లో ప్రసంగించారని, ప్రతి సభలోనూ తనపైనే విమర్శనాస్త్రాలు సంధించారని పవార్ పేర్కొన్నారు. గతంలో అద్వానీని తన రాజకీయ గురువుగా ప్రస్తావించిన మోదీ తదనంతర కాలంలో ఆయనను పక్కన పెట్టేసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకునే పవార్ ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు.

More Telugu News