Telangana: తెలంగాణ ఇంటర్ బోర్డు లీలలు: ఫస్టియర్‌లో జిల్లా టాపర్.. ద్వితీయ సంవత్సరంలో తెలుగులో సున్నా మార్కులు

  • ఫస్టియర్‌లో తెలుగులో 98 మార్కులు
  • ద్వితీయ సంవత్సరంలో సున్నా మార్కులు
  • 25 వేల మంది విద్యార్థులకు చేదు అనుభవం

తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గతేడాది ఇంటర్‌ ఫస్టియర్‌లో జిల్లా టాపర్‌గా నిలిచిన విద్యార్థికి ఈసారి ఇంటర్ బోర్డు చుక్కలు చూపించింది. ఫస్టియర్ తెలుగులో 98 మార్కులు సాధించిన మంచిర్యాల జిల్లా టాపర్‌ అయిన ఓ బాలికకు ఈసారి ఒక్కటంటే ఒక్క మార్కు కూడా రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విద్యార్థినికి వచ్చిన మార్కుల మెమో చూసి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. తెలుగులో సున్నా మార్కులు రావడంతో లబోదిబోమన్నారు.
 
ఇది ఆ అమ్మాయి ఒక్కరి పరిస్థితే కాదు.. దాదాపు 25 వేల మంది విద్యార్థులుకు ఇటువంటి పరిస్థితే ఎదురైంది. అధికారులు ఇష్టారాజ్యంగా పేపర్లు దిద్దడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, పరీక్షల్లో ఫెయిలయ్యామన్న మనస్తాపంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

More Telugu News