Chandrababu: నా మీద ఆంక్షలు పెడితే ఓకే! కానీ ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దు: చంద్రబాబు

  • అధికారులపై వ్యతిరేక భావం లేదు
  • ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆంక్షలా?
  • 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తిరుపతిలో బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులపై తనకు ఎలాంటి వ్యతిరేక భావనలు లేవని, వారిని బాధపెట్టాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. కొందరు అధికారులపై ఉన్న కేసులు జగన్ వ్యవహారానికి సంబంధించినవని, అవి ఇంతకుముందే పెట్టిన కేసులని తెలిపారు. అయితే, రాష్ట్రంలోని ప్రజలు, సాగునీరు, తాగునీటికి ఎంతో ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆంక్షలు విధించడం సరికాదని అన్నారు.

"నా మీద ఆంక్షలు విధిస్తే నేను పోరాడుతా. లేకపోతే, అందరిపైనా ఆంక్షలు విధించండి, నాకేమీ ఇబ్బందిలేదు, నేనూ స్వాగతిస్తా. మేమే దేశాన్ని పరిపాలిస్తాం, మేమే రాష్ట్రాలను పరిపాలిస్తాం అంటే చెయ్యండి! ప్రజాస్వామ్యాన్ని కాదనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నా నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు. నా బాధ ఏంటంటే, ఎందుకు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఇన్ని కఠిన ఆంక్షలు వర్తింపజేస్తున్నారు? నేను మీపై పోరాడుతున్నాను అనా? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుకెళుతున్నాను అనా? వీవీ ప్యాట్లు లెక్కించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను అనా? అసలేంటి మీ సమస్య?" అంటూ నిలదీశారు.

More Telugu News