Warangal: అక్క పిల్లల్ని తీసుకొస్తూ.. రోడ్డు ప్రమాదంలో పిల్లలతో సహా మేనమామ అనంత లోకాలకు..!

  • కారు, ద్విచక్ర వాహనం పరస్పరం ఢీ
  • ప్రమాదంలో మేనమామ, మేనకోడళ్లు మృతి
  • మరో చిన్నారి పరిస్థితి విషమం

వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మేనమామ సహా ఇద్దరు చిన్నారి మేన కోడళ్లు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని గీసుకొండ మండలం కొమ్మాల వద్ద ఎదురెదురుగా వస్తున్న కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. చెన్నారావుపేట మండలం జెల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు తన అక్క కుమార్తెలను తన స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు వెళ్లి పిల్లలతో తిరిగి బైక్‌పై వస్తున్నాడు.

వరంగల్‌-నర్సంపేట ప్రధాన రహదారిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపానికి చేరుకోగానే ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మేనమామతోపాటు ఇద్దరు మేనకోడళ్లూ అక్కడికక్కడే మృతి చెందగా, మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. హుటాహుటిన ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News