Asaduddin Owaisi: మోదీ మాటలు వేరు...చేతలు వేరు: మండిపడిన అసదుద్దీన్‌ ఒవైసీ

  • ఉగ్రవాదం గురించి మాట్లాడుతారు
  • ఉగ్రదాడుల కేసులో నిందితులకు టికెట్లు ఇస్తారు
  • నెలరోజుల్లో ఆయన మాజీ కావడం ఖాయం

ప్రధాని నరేంద్ర మోదీ మాటలకు, చేతలకు అంతులేనంత అంతరం ఉంటుందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. ఓ వైపు ఉగ్రవాద నిరోధం, దేశభద్రత గురించి అద్భుతమైన మాటలు వల్లె వేస్తారని, మరోవైపు ఉగ్రదాడుల్లో నిందితులకే తమ పార్టీ తరపున టికెట్లు ఇచ్చి నిలబెడతారని ఆరోపించారు.

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీపై ఎప్పటిలాగే విరుచుకుపడ్డారు. ఉగ్రవాదం నిరోధం గురించి ఉపన్యాసాలు దంచేస్తున్న మోదీ మాలేగావ్‌ పేలుళ్ల ద్వారా ఆరుగురు అమాయకుల ప్రాణాలను బలిగొన్న కేసులో నిందితురాలు సాద్వి ప్రగ్యాసింగ్‌ ఠాకూర్ కు బీజేపీ టికెట్టు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉగ్రవాదంపై పోరాడుతున్నట్టు చెప్పడం హాస్యాస్పదమన్నారు. మోదీ కల్లబొల్లి మాటలు దేశ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఆయన నెలరోజుల్లో మాజీ కావడం ఖాయమన్నారు.

More Telugu News