Love Marriage: బైక్ పై నవ దంపతులు వెళుతుంటే యాక్సిడెంట్... ఘటన వెనుక నమ్మలేని నిజం!

  • తొమ్మిది నెలల క్రితం కులాంతర ప్రేమ వివాహం
  • భార్యను చంపాలని మాస్టర్ ప్లాన్ వేసిన జగదీశ్వరరెడ్డి
  • పోలీసులకు వచ్చిన అనుమానంతో అసలు నిజం వెలుగులోకి

తొమ్మిది నెలల క్రితం కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న జంట, బైక్ పై వెళుతూ ఉంటే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ యువతి అక్కడికక్కడే మరణించగా, యువకుడు గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. విచారణలో భాగంగా తమకు వచ్చిన అనుమానం, కేసులో నమ్మలేని నిజాన్ని వెలుగులోకి తెచ్చింది. అదేంటో తెలియాలంటే పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళ్లాల్సిందే.

అనంతపురం శివారు ప్రాంతానికి చెందిన సరోజ, రాప్తాడు మండలానికి చెందిన జగదీశ్వర్ రెడ్డి ప్రేమలో పడి, వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత ఇద్దరి మధ్యా చిన్నచిన్న గొడవలు జరుగగా, పెద్దలు సర్దిచెబుతూ వచ్చారు. ఈ క్రమంలో నిన్న తెల్లవారుజామున 4 గంటల సమయంలో కూడేరు వైపు దంపతులు బైక్ పై వెళుతుండగా, కమ్మూరు సమీపంలో వారి బైక్ ను లారీ ఢీకొంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ లో జగదీశ్వరరెడ్డిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి, సరోజ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

సరోజ మృతదేహాన్ని చూసిన పోలీసులకు అది సాధారణ యాక్సిడెంట్ మాదిరిగా కనిపించలేదు. అనుమానం వచ్చిన వారు, జగదీశ్వర్ రెడ్డిని గట్టిగా ప్రశ్నించి అవాక్కయ్యారు. తన భార్యను ఎలాగైనా హత్య చేయాలన్న ఉద్దేశంతో తనే స్వయంగా యాక్సిడెంట్ చేశానని, స్వల్ప గాయాలతో ఉన్న సరోజ తలపై బండతో మోది హత్య చేశానని అంగీకరించాడు. భార్యను చంపి, ప్రమాదంలా చిత్రీకరించాలని చూసిన జగదీశ్వరరెడ్డికి కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు.

More Telugu News