toll free number: అత్యవసర సేవలకు ఇక దేశం మొత్తం ఒకటే నంబరు-112.. ఏపీ, తెలంగాణలోనూ అందుబాటులోకి!

  • సాయం ఏదైనా ఇక ఒకటే నంబరు
  • మొత్తం 20 రాష్ట్రాల్లో అందుబాటులోకి
  • ఈఆర్‌సీ ద్వారా సత్వర సేవలు

ఇప్పటి వరకు వివిధ అత్యవసర సేవలకు వివిధ ఫోన్ నంబర్లు అందుబాటులో ఉండగా, ఇప్పుడు అన్ని సేవలకు ఒకే నంబరు అందుబాటులోకి వచ్చింది. ఒక్కో సాయం కోసం ఒక్కో నంబరు అందుబాటులో ఉండడం వల్ల ప్రజలు తికమకపడుతుండడంతో స్పందించిన ప్రభుత్వం ఇప్పుడు 112ను అందుబాటులోకి తెచ్చింది. ఈ టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేయడం ద్వారా ఎటువంటి సమస్యకైనా సాయం పొందవచ్చు. ఈ సరికొత్త హెల్ప్‌లైన్ నంబరు ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అందుబాటులో ఉండగా, ఇప్పుడు మరిన్ని రాష్ట్రాలకు అందుబాటులోకి వచ్చింది. కేంద్రపాలిత ప్రాంతాలు సహా మొత్తం 20 రాష్ట్రాలకు ఇప్పుడీ నంబరును అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ నంబరు అందుబాటులోకి వచ్చిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, కేరళ, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, గుజరాత్‌, పుదుచ్చేరి, లక్షద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు, దాద్రానగర్‌ హవేలి, డామన్‌ డయ్యు, జమ్ముకశ్మీర్‌, నాగాలాండ్‌ ఉన్నాయి. సాయాన్ని అర్థించే వ్యక్తులు 112 నంబరుకు ఫోన్ చేస్తే అది వారికి దగ్గరలోని నెట్‌వర్క్‌ టవర్‌ ఆధారంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ (ఈఆర్‌సీ)కి అనుసంధానం అవుతుంది. దీంతో సంబంధిత అధికారులు సత్వరం స్పందించి సాయం అందిస్తారు.

More Telugu News