kolkata knight riders: కోల్‌కతాపై చెలరేగిన కోహ్లీ.. మూడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో సెంచరీ

  • 9 మ్యాచులు ఆడిన బెంగళూరుకు ఇది రెండో విజయం
  • ఐపీఎల్‌లో ఐదో శతకం బాదిన కోహ్లీ
  • రస్సెల్ మెరిసినా ఓడిన కోల్‌కతా

ఐపీఎల్‌లో కోహ్లీ సేన మరో విజయాన్ని అందుకుంది. శుక్రవారం కోల్‌కతాలోని నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పది పరుగుల తేడాతో విజయం సాధించి రెండో విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరుకు ఇది రెండో విజయం.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 213 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ అద్భుత ఆటతీరుతో మరోమారు ఆకట్టుకున్నాడు. 58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో సరిగ్గా వంద పరుగులు చేసి ఐపీఎల్‌లో ఐదో సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా ఈ జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. పంజాబ్ ఓపెనర్ క్రిస్‌గేల్ ఆరు సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మెయిన్ అలీ 28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు.  

అనంతరం 214 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 203 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. నితీశ్ రాణా 46 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 85 పరుగులు, ఆండ్రూ రస్సెల్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్సర్లతో 65 పరుగులు చేసినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. విరాట్ కోహ్లీకి  ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

More Telugu News