Congress: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి ఝులక్.. నోటీసులు జారీచేసిన ఈసీ!

  • యూపీలోని అమేథీలో భారీ బ్యానర్లు
  • కాంగ్రెస్ నినాదాలు, రాహుల్ ఫొటోలతో ఏర్పాటు
  • అనుమతి లేకుండానే ఏర్పాటుచేసిన కాంగ్రెస్ శ్రేణులు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నియోజకవర్గంలో రాహుల్ ఫొటోలతో కూడిన భారీ బ్యానర్లు ఏర్పాటు కావడంపై నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంపై లిఖితపూర్వకంగా జవాబు ఇవ్వాలని ఆదేశించింది. తాము అధికారంలోకి వస్తే దేశంలోని అత్యంత నిరుపేదలైన 20 శాతం మందికి(5 కోట్ల కుటుంబాలు-25 కోట్ల మంది ప్రజలు) న్యాయ్ పథకం కింద ఏటా రూ.72 వేలు ఇస్తామని రాహుల్ గతంలో ప్రకటించారు.

దీనికి సంబంధించి ‘ఇప్పుడు న్యాయం జరుగుతుంది’ అనే నినాదాలు, రాహుల్ ఫొటోలతో కూడిన పోస్టర్లను కాంగ్రెస్ శ్రేణులు అమేథీలో పెట్టాయి. అయితే ఇందుకు ఈసీ అధికారుల నుంచి అనుమతి తీసుకోలేదు. అమేథీలో పర్యటించిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ఈ తరహా భారీ బ్యానర్లను గుర్తించి, వాటికి సంబంధించిన పత్రాలు చూపాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు.

అయితే కార్యకర్తల వద్ద వీటికి సంబంధించి ఎలాంటి పత్రాలు లభించలేదు. దీంతో చివరకు ఈసీ రాహుల్ గాంధీకి నోటీసులు జారీచేసింది. కాగా, ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ, రాహుల్ ఇంతవరకూ స్పందించలేదు. రాహుల్ గాంధీ ప్రస్తుతం యూపీలోని అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు.

More Telugu News