KA Paul: లక్ష కోట్లు ఉన్నప్పుడూ అలాగే ఉన్నాను, లక్ష రూపాయలు లేనప్పుడూ అలాగే ఉన్నాను: కేఏ పాల్

  • ప్రతిదానికీ సమయము కలదు
  • ప్రజల కోసమే ఏడ్చాను
  • బైబిల్ వాక్యాలు వల్లించిన పాల్

పోలింగ్ తదనంతర పరిస్థితుల నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఓ టీవీ చానల్ స్టూడియోలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉన్నానని, ఏమీ మారలేదని స్పష్టం చేశారు. 20 ఏళ్ల క్రితం అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో తాను అక్కడి గవర్నర్ మైక్ హక్కాబీతో కలిసి రోజూ అనేక కిలోమీటర్ల దూరం పరుగులు తీసేవాడ్నని చెప్పారు. తనతో పరుగు తీయడం ద్వారా హక్కాబీ ఎంతో బరువు తగ్గారని వివరించారు. తాను లక్ష కోట్ల సంపద ఉన్నప్పుడు, చేతిలో కనీసం లక్ష రూపాయలు లేనప్పుడు కూడా ఒకేలా ఉన్నానని స్పష్టం చేశారు.

"ప్రతిదానికీ సమయము కలదు, నవ్వుటకు సమయము కలదు, ఏడ్చుటకునూ సమయము కలదు" అంటూ ఈ సందర్భంగా బైబిల్ వాక్యాలను ఉదహరించారు. తాను ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నోసార్లు ఏడ్వాల్సి వచ్చిందని అన్నారు. ఆనాడు ఏసుక్రీస్తు నిర్భాగ్యుల కన్నీళ్లు తుడిచేందుకు తాను కూడా ఏడ్చాడని, ఇప్పుడు తాను సైతం ప్రజల కోసం కన్నీళ్లు పెట్టాల్సివస్తోందని పాల్ తెలిపారు.

More Telugu News