Andhra Pradesh: మీడియా సమావేశంలో బీజేపీ నేత జీవీఎల్ పైకి చెప్పును విసిరిన యూపీ వ్యక్తి!

  • ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఘటన
  • మీడియా సమావేశం ఏర్పాటుచేసిన జీవీఎల్
  • నిందితుడిని బయటకు లాక్కెళ్లిన పోలీసులు, బీజేపీ కార్యకర్తలు

బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ కు చేదు అనుభవం ఎదురయింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జీవీఎల్ ఈరోజు మీడియా సమావేశం నిర్వహిస్తుండగా, అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. జీవీఎల్ మీడియాతో మాట్లాడుతుండగానే ఓ వ్యక్తి ఆయనపై చెప్పును విసిరాడు. వెంటనే అప్రమత్తమైన బీజేపీ కార్యకర్తలు, పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని బయటకు లాక్కెళ్లారు.

కాగా, జీవీఎల్ పై చెప్పు విసిరిన వ్యక్తిని యూపీలోని కాన్పూర్ కు చెందిన శక్తి భార్గవగా పోలీసులు గుర్తించారు. ఇతడిని పోలీసులు ఢిల్లీలోని కమలానగర్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. జీవీఎల్ ప్రస్తుతం రాజ్యసభకు యూపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉండేవారితో జీవీఎల్ కు ఏమైనా గొడవలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇతను బీజేపీ కార్యకర్తేనా? లేక మీడియా సభ్యుడా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

More Telugu News