Telangana: పెళ్లికి నో చెప్పిన పెద్దలు.. పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్న యువజంట!

  • తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఘటన
  • ప్రేమించుకున్న మల్లేశ్, శిల్ప
  • వివాహానికి అంగీకరించని ఇరు కుటుంబాలు

పెద్దలు తమ వివాహానికి అంగీకరించలేదన్న కారణంతో యువతీయువకులు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇరుకుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో నిన్న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జిల్లాలోని తలకొండపల్లి మండలం వెంకటాపూర్‌కు చెందిన మల్లేశ్(19), శిల్ప(17) ప్రేమించుకున్నారు. అయితే వీరి వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో విడిపోయి బతకడం కంటే కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారు. ఊరి సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

ఈరోజు ఉదయం పొలంలో యువ జంట నిర్జీవంగా పడిఉండటాన్ని గుర్తించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

More Telugu News