Telangana: హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. గాల్లోకి ఎగిరిపడి బైకర్ దుర్మరణం!

  • అతివేగంగా వచ్చి బైకును ఢీకొట్టిన బస్సు
  • అంతెత్తున ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
  • మృతుడు రామాంతపూర్ కు చెందిన హరినాయక్ 

  హైదరాబాద్ లో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ఉప్పల్ ప్రాంతంలో బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తిని అటుగా వెళుతున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో అమాంతం గాల్లోకి ఎగిరిపడ్డ వాహనచోదకుడు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఉప్పల్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.

ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో రామాంతపూర్ కు చెందిన హరినాయక్ ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. హరినాయక్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన బస్సు జనగామ డిపోకు చెందినదని పేర్కొన్నారు. బస్సు అతివేగంగా రావడమే ఈ ప్రమాదానికి కారణమని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

More Telugu News