Yogi Adithyanath: ఈసీ నిషేధం విధించడంతో అందరూ ఆశ్చర్యపోయే పనులు చేసిన యోగి ఆదిత్యనాథ్

  • గోరఖ్ నాథ్ ఆలయంలో హనుమాన్ చాలీసా పఠనం
  • ఓ దళితుడి ఇంట్లో భోజనం
  • ట్రిపుల్ తలాక్ బాధితురాలితో మాటామంతీ

నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారంటూ తనపై ఎన్నికల సంఘం మూడు రోజుల నిషేధం విధించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. మంగళవారం నాడు గోరఖ్ నాథ్ దేవాలయంలో భక్తులకు హనుమాన్ చాలీసా చదివి వినిపించారు. ఆధ్యాత్మిక భావనలు మెండుగా ఉండే యోగి చాలీసాను అత్యంత భక్తిశ్రద్ధలతో పఠించిన వైనం భక్తులను ఆకట్టుకుంది. స్థానిక గోరఖ్ నాథ్ మఠానికి ఆయన ప్రధాన గురువు అని తెలిసిందే.

ఇక, బుధవారం తన నివాసంలో ఓ ట్రిపుల్ తలాక్ బాధితురాలితో మాట్లాడి ఆమెలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లా వాసి నజియా ఇటీవలే ట్రిపుల్ తలాక్ కారణంగా విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. తన నివాసంలో ఆమెతో మాట్లాడుతూ అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఆపై యోగి ఓ దళితుడి నివాసానికి వెళ్లారు. అక్కడ ఆ దళితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్లను విస్మయానికి గురిచేశారు. యోగి తన భోజనాన్ని అక్కడే ముగించడం కూడా ఎవరి ఊహకు అందలేదు.

More Telugu News