Chandrababu: చంద్రబాబు ఎప్పుడు పిలిచినా అంబరీష్ వచ్చారు, కానీ చంద్రబాబు ఇవాళ సుమలత ఓటమికి పాటుపడుతున్నాడు: మోహన్ బాబు

  • నా మాట విని అంబరీష్ వచ్చారు
  • చంద్రబాబుకు కృతజ్ఞత అనేదే లేదు
  • సుమలతకే ఓటేయండి

ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు నటుడు మోహన్ బాబు. ట్విట్టర్ ను వేదికగా చేసుకున్న ఆయన, కర్ణాటకలో చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని తప్పుబట్టారు. ముఖ్యంగా మాండ్యలో నటి సుమలతకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయడం తనను విస్మయానికి గురిచేసిందన్నారు.

"చంద్రబాబు ఒకప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు కాదు, ఎప్పటికీ కాలేడు. అలాంటి వ్యక్తి కోసం నా మిత్రుడు అంబరీష్ ఎప్పుడు పిలిచినా కాదనకుండా వచ్చాడు. చంద్రబాబు నిర్వహించిన కార్యక్రమాలకు నేను రికమెండ్ చేస్తే అంబరీష్ వచ్చాడు. కానీ చంద్రబాబు ఇప్పుడా కృతజ్ఞత అనేదే లేకుండా అంబరీష్ భార్య సుమలతకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు. ఆమె ఓటమికి తాను ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు. సుమలతపై చంద్రబాబు వ్యతిరేక ప్రచారం చేయడం ఆశ్చర్యంతో పాటు హాస్యాస్పదంగానూ అనిపిస్తోంది" అంటూ విమర్శలు గుప్పించారు.

అంతేకాకుండా, ఈ ఎన్నికల్లో సుమలతకు ఓటేసి అంబరీష్ ఆశయాలను గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. మాండ్య ప్రజల సంక్షేమం ఆయనకు ఊపిరి అని పేర్కొన్నారు. ఇప్పుడు సుమలతను మనందరి బిడ్డలా స్వీకరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News