Andhra Pradesh: అదనపు కట్నం కోసం కోడలి కడుపుపై తన్నిన అత్త, బ్లేడుతో మణికట్టు కోసిన సైకో భర్త!

  • ఏపీలోని విశాఖపట్నంలో ఘటన
  • యువతికి తల్లీకొడుకుల వేధింపులు
  • విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితురాలు

కట్నం కోసం కడుపుతో ఉన్న కోడలికి ఓ అత్త నరకం చూపించింది. అదనపు కట్నం కింద రూ.25 లక్షలు తీసుకుని రావాలని దాడి చేసింది. ఆమెకు కుమారుడు కూడా తోడయ్యాడు. కట్నం తీసుకురావాలని బ్లేడ్ తో మణికట్టును కోశాడు. కట్నం తీసుకురాకుంటే అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశారు. వీరి వేధింపులు శ్రుతి మించడంతో బాధితురాలు స్థానికుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది.

విశాఖ జిల్లాలోని పెందుర్తికి చెందిన దామోదర్ కు, అదే ప్రాంతానికి చెందిన రాజేశ్వరితో ఇటీవల పెళ్లయింది. ఈ సందర్భంగా అమ్మాయి కుటుంబ సభ్యులు బాగానే కట్నకానుకలు సమర్పించుకున్నారు. వివాహమైన కొత్తల్లో అంతా బాగానే ఉన్నప్పటికీ కొన్నిరోజుల తర్వాత అత్త లలిత రాజేశ్వరికి నరకం చూపించడం ప్రారంభించింది.

రాజేశ్వరి నెలతప్పడంతో అదనపు కట్నం తీసుకురావాలనీ, లేదంటే అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేసేది. అయితే భార్యకు అండగా నిలవాల్సిన దామోదర్ తల్లికి వంతపాడాడు. సైకోగా మారి బ్లేడుతో మణికట్టును పలుమార్లు కోశాడు.

చివరికి ఈరోజు పరీక్షల కోసం ఆసుపత్రికి వెళతామని తల్లీకుమారులు నమ్మబలికారు. దీంతో రాజేశ్వరి కారులో బయలుదేరింది. మార్గమధ్యంలో కోడలితో గొడవ పెట్టుకున్న అత్త లలిత.. రాజేశ్వరి కడుపుపై తన్నింది. పుట్టింటి నుంచి రూ.25 లక్షలు అదనపు కట్నం తీసుకురావాలనీ, లేదంటే అబార్షన్ చేయించుకోవాలని మరోసారి స్పష్టం చేసింది.

కడుపుపై తన్నడంతో నొప్పితో అల్లాడిపోయిన రాజేశ్వరి గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు కారును ఆపివేశారు. దీంతో భర్త, అత్త బారినుంచి తప్పించుకున్న రాజేశ్వరి ఎమ్మార్ పేట పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి బాధితురాలిని పోలీసులు తరలించారు. అనంతరం రాజేశ్వరి వాంగ్మూలం మేరకు అత్త లలిత, భర్త దామోదర్ పై కేసు నమోదుచేశారు.

More Telugu News