Telangana: వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య.. ప్రియుడిని కల్లుకత్తితో నరికి పోలీసులకు లొంగిపోయిన భర్త!

  • తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఘటన
  • ఉపేంద్ర అనే యువకుడితో భార్య వివాహేతర సంబంధం
  • ఆగ్రహంతో ప్రియుడిని నరికి చంపిన భర్త విష్ణు

తన భార్య మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఓ భర్త రెచ్చిపోయాడు. భార్యను వదిలేసి సదరు యువకుడిని కల్లు గీసే కత్తితో వెంటపడి నరికాడు. అతను ప్రాణాలు కోల్పోయేవరకూ దాడిచేసిన అనంతరం భార్యతో కలిసి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో నిన్న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జిల్లాలోని బోనకల్లు మండలం మోటమర్రిలో విష్ణు, తన భార్యతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఉపేంద్రతో విష్ణు భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది తెలుసుకున్న విష్ణు ప్రవర్తనను మార్చుకోవాల్సిందిగా భార్యను హెచ్చరించాడు. అయినా ఆమె పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో విష్ణు తాటికల్లు గీసేందుకు నిన్న చెట్ల వద్దకు వెళ్లాడు. ఇందుకోసమే వేచిచూస్తున్న ఉపేంద్ర విష్ణు ఇంట్లోకి దూరాడు.

అదే సమయంలో ఇంటికి వచ్చిన విష్ణు, తన భార్యతో ఉపేంద్ర సన్నిహితంగా ఉండటం చూసి ఆగ్రహంతో రగిలిపోయాడు. కల్లుగీసే కత్తితో వెంటపడి మరీ నరికాడు. పదునైన కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ ఉపేంద్ర ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం భార్యను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి విష్ణు లొంగిపోయాడు. ఈ నేపథ్యంలో భర్తతో పాటు భార్యపై కూడా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News